
సఖినేటిపల్లి: ఫిబ్రవరి,5(తెలుగు న్యూస్ పవర్) అంతర్వేది లక్ష్మీనరసింహుడే తమను కాపాడుతున్నాడని, జనసేన నాయకులు, రాజోలు ఎమ్మెల్యే దేవ వర ప్రసాద్ వెల్లడించారు. స్వామివారి ఆలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు, ప్రవచన కార్యక్రమం సందర్భంగా, గురువారం, వరప్రసాద్ మాట్లాడారు. మోంత తుఫాను, ఇరుసుమండ బ్లో అవుట్ నుంచి ఆ నరసింహస్వామి కాపాడారని తెలిపారు. ఈ క్షేత్రంలో తొమ్మిది బుధవారాల ప్రాశస్త్యం గురించి చాగంటి వారు తన ప్రవచనంలో తెలియజేయాలని కోరారు. దాదాపు 34 ఎకరాలు స్వామివారి ఆలయ ప్రాంగణానికి ప్రహరీ నిర్మాణం, 34 లక్షలతో కోనేరు నిర్మాణం, బస్ స్టేషన్ ఏర్పాటు, లోతట్టు ప్రాంతంలో ఉన్న ఆలయాన్ని ఎత్తు చేయటం వంటి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. భక్తుల రద్దీ ప్రతి ఏట పెరుగుతున్నందున, రాబోయే ఏడాదికి, ఇప్పటి ఆరు లక్షల మంది కంటే ఎక్కువ మంది రావటానికి తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నట్టు ప్రవచనకర్త చాగంటి వారికి తెలిపారు. ప్రవచన కార్యక్రమం ప్రారంభానికి ముందు ఈ ఓ సత్యనారాయణతో కలిసి బ్రహ్మశ్రీ చాగంటి వారికి సత్కారం చేశారు.
అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి, పశ్చిమ ముఖుడై ఉండటం, లక్ష్మీ సమేతుడై ఉండటం, సముద్రం తీరాన ఉండటం, ఎన్నోసార్లు ఆపదల నుంచి కాపాడుతూ, తన మహిమను తానే నిరూపించుకోవడం, ఇవన్నీ నరసింహస్వామి వారి విశేష విభూతులని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు తన ప్రవచన కార్యక్రమం ప్రారంభంలో వెల్లడించారు. ఈ క్షేత్రానికి బయలుదేరి వస్తున్నప్పుడు తాము కూడా ఒక ప్రమాదం నుంచి బయటపడటానికి ఈ లక్ష్మీనరసింహుడే కారణమని తెలిపారు. స్వామివారు 6లక్షల మంది భక్తులకు ఈ మేలు చేయకపోతే, దర్శనం కోసం ఎందుకు వస్తారని, స్వామి వారి దర్శనం వల్ల కోరికలు నెరవేరుతాయన్నారు. చాగంటి ప్రవచన కార్యక్రమంలో విశేషంగా భక్తులు పాల్గొన్నారు.