Skip to main content

Telugu News Power

గోదావరి తీరాన ఉరకలేస్తున్న అభివృద్ధి. పట్టణాలకు ధీటుగా పల్లెలకూ పుష్కర శోభ.

పుష్కలంగా పుష్కర నిధులు సాధించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
పుష్కర పనుల్లో అధికారులు బిజీ

మరో రూ.100 కోట్లు మంజూరు చేయించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

గ్రామీణ రహదారులు, తాగు నీటి సదుపాయాల కల్పనకు నిధులు
పంచాయతీరాజ్ నిధులు రూ.90 కోట్లతో 7 నియోజకవర్గాల్లో రహదారుల అభివృద్ధి
తాగు నీటి సరఫరా కోసం ఆర్‌డబ్ల్యూఎస్ నుంచి మరో రూ.10 కోట్లు
ఇప్పటికే ఏపీపీసీబీ ద్వారా రూ.100 కోట్లు కేటాయించిన ఉప ముఖ్యమంత్రివర్యులు

అమరావతి:సెప్టెంబర్,1( తెలుగు న్యూస్ పవర్. కామ్)
‘స్వచ్ఛ గోదావరి – పవిత్ర పుష్కరాలు’ అనే థీమ్‌తో గోదావరి నది పరివాహక ప్రాంతంలోని గ్రామాల్లో ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ముందుకు తీసుకెళ్తున్నారు. గోదావరి పుష్కరాల సందర్భంగా, మూడు జిల్లాల పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల కోసం పంచాయతీరాజ్, గ్రామీణ తాగు నీటి సరఫరా (ఆర్‌డబ్ల్యూఎస్) శాఖల ద్వారా రూ.100 కోట్ల నిధులను విడుదల చేశారు. గతంలో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (ఏపీపీసీబీ) ద్వారా విడుదల చేసిన రూ.100 కోట్లకు ఇవి అదనం.

ఈ నిధులతో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, పోలవరం ప్రాంతాల పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో రూ. 90 కోట్లతో 111 పనులను చేపట్టనున్నారు. వీటి ద్వారా సుమారు 141 కిలోమీటర్ల మేర సీసీ, బీటీ రహదారుల నిర్మాణం చేపడతారు. రూ.10 కోట్లతో.. పుష్కరాలకు వచ్చే భక్తులకు రక్షిత తాగునీటి సదుపాయాలు కల్పించనున్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలోని రాజోలు, పి. గన్నవరం, రామచంద్రపురం, రంపచోడవరం, ఆచంట, నరసాపురం, పాలకొల్లు తదితర నియోజకవర్గాల్లో గ్రామాల నుంచి పుష్కర ఘాట్లకు వెళ్లే మార్గాల్లో బీటీ, సీసీ రోడ్లు నిర్మాణం చేపట్టనున్నారు. అవసరమైన చోట గ్రామాల్లో అంతర్గత రహదారులను కూడా అభివృద్ధి చేయనున్నారు. గోదావరి పుష్కరాలను కేవలం రాజమహేంద్రవరం వంటి ప్రధాన కేంద్రాలకే పరిమితం చేయకుండా, పవిత్ర నదీ పరివాహక ప్రాంతంలోని ప్రతి గ్రామంలో భక్తులు పుష్కర స్నానాలు, పూజలు, పితృదేవతలకు తర్పణాలు నిర్వహించుకునేలా అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలనే లక్ష్యంతో ఈ పనులు చేపడుతున్నారు.

ప్రతి పుష్కర ఘాట్‌లో రక్షిత తాగు నీటి సదుపాయాలు
గ్రామీణ రహదారులతో పాటు ప్రతి పుష్కర ఘాట్‌లో రక్షిత ₹తాగు నీటి సరఫరా బాధ్యతలను కూడా గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం ద్వారా చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ రూ.7 కోట్ల వ్యయంతో రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గ పరిధిలోని మునికూడలిని ‘మోడల్ పుష్కర పంచాయతీ’గా అభివృద్ధి చేస్తున్నారు. సప్త ఋషి ఘాట్‌కు సకల హంగులు కల్పించే పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో సీసీ రహదారుల నిర్మాణం, టవర్ లైట్ల ఏర్పాటు, మునికూడలి గ్రామంలో మ్యాజిక్ డ్రెయిన్లు, ఇంకుడు గుంతల నిర్మాణం, పుష్కర ఘాట్ల వద్ద మరుగుదొడ్ల నిర్మాణం వంటి పనులు పూర్తికావస్తున్నాయి.

ఏపీపీసీబీ నిధులతో సమగ్ర అభివృద్ధి
కాలుష్య నియంత్రణ మండలి ద్వారా కేటాయించిన రూ.100 కోట్లను ఆయా జిల్లాల నుంచి అందిన ప్రతిపాదనల ఆధారంగా ప్రాధాన్య క్రమంలో వినియోగించనున్నారు. పోలవరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాల పరిధిలో ప్రతిపాదిత అభివృద్ధి పనుల కోసం ఈ నిధులను వినియోగించి గోదావరి పుష్కరాలను మరింత సౌకర్యవంతంగా, పరిశుభ్రంగా నిర్వహించేలా చర్యలు చేపడుతున్నారు.