
యలమంచిలి/ మలికిపురం
ఆగస్టు19 ( తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమగోదావరి జిల్లా, యలమంచిలి మండలం, చించినాడ- డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం దిండి మధ్య,జాతీయ రహదారి–216పై కీలకమైన చించినాడ వంతెనపై భారీ వాహనాల రాకపోకలకు బుధవారం రాత్రి నుంచి అనుమతి లభించింది. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే లారీలు, ఇతర భారీ వాహనదారులకు, రోజువారి పదుల సంఖ్యలో నడిచే విద్యార్థుల బస్సులు వంతెనపై పరుగులు తీయడానికి దారులు తెరుచుకున్నాయి.
సుమారు ఏడాదికాలంగా కాలంగా వంతెనపై భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు ఉండటంతో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయించాల్సి వచ్చింది. 30 ఏళ్ల వయసున్న ఈ వంతెనకు గత ఏడాది జులైలో మరమ్మతులు చేపట్టారు. ఈ ప్రక్రియ చాలా నిదానంగా జరగడంతో మరమ్మతులు చేయటానికి తీవ్ర జాప్యం జరిగింది. అంతర్వేది నరసింహస్వామి కళ్యాణం ఉత్సవాలకు ఈ వంతెనను అనివార్యంగా తెరవలసి వచ్చింది. ఈ పనుల్లో ముఖ్యమైన బేరింగుల ఏర్పాటు ప్రక్రియ, వేసవిలో వ్యాకోచించే వంతెన మధ్య రక్షణ ఏర్పాట్లకు పాలిమర్ కాంక్రీట్ తో అనుసంధానం పనులు పూర్తి చేశారు.తాజాగా వంతెనను ఎన్ హెచ్ ఈ ఈ పరిశీలించిన అనంతరం భారీ వాహనాల రాకపోకలకు అనుమతించినట్లు ఈ వెంకటరమణ పత్రికలకు వెల్లడించారు.
చించినాడ వంతెన జాతీయ రహదారి–216పై కీలకమైన అనుసంధానంగా ఉండటంతో, భారీ వాహనాల రాకపోకలు పునరుద్ధరణతో సరకు రవాణా మరింత సులభతరం కానుంది. ఈ మార్గం ద్వారా ప్రయాణించే వాహనదారులు అధికారులు సూచించిన భద్రతా నిబంధనలు పాటించాలని కోరుతున్నారు.