Skip to main content

Telugu News Power

రైల్వే శాఖ ఆంధ్రా వైపు మరో భారీ ప్టోజెక్ట్ కు శ్రీకారం. 90కిమీ 3-4 రైల్వే లైను ఏర్పాటు. వ్యయం రూ. 2,229 కోట్లు.

కొత్త రైల్వే లైన్లు ఏర్పాటు కానున్న పారిశ్రామిక నడవ
విశాఖపట్నం చెన్నై మధ్య పారిశ్రామిక నడవ లో అభివృద్ధి పరచనున్న కొత్త రైల్వేలైనులు.

తమిళనాడు రూటు లో తీరనున్న కష్టాలు.

న్యూఢిల్లీ:ఆగస్టు,20( తెలుగు న్యూస్ పవర్. కామ్)ఏపీలోని రైల్వే ప్రయాణీకులకు కేంద్రం తీపి కబురు చెప్పింది. ఏపీ- తమిళనాడు మధ్య రైళ్ల రాకపోకలు సుగమం చేసి ప్రయాణీకుల సమస్యలు తీర్చే నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం అందుతున్న సేవలను మరింతగా పెంచుతూ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. దీని ద్వారా రైల్వే ప్రయాణీకుల కు ప్రయోజనం కలగనుంది. దీనికి సంబంధించిన కేంద్ర కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలను రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ గురువారం వెల్లడించారు.
ఏపీ- తమిళనాడు మధ్య మరో రైల్వే కీలక ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ రెండు రాష్ట్రాల మధ్య రైల్వే లైన్ల విస్తరణ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. గూడూరు-గుమ్మిడిపూండి మధ్య 90 కిలోమీటర్ల మేర మూడో, నాలుగో రైల్వే లైన్ల నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని ద్వారా వైజాగ్‌-చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్‌(వీసీఐసీ) పరిధిలో, అలాగే ఈస్ట్‌ కోస్ట్‌ ఎకనామిక్‌ కారిడార్‌లో కీలక భాగమైన గూడూరు-గుమ్మిడిపుడి సెక్షన్‌ మధ్య రూ.2,229 కోట్ల వ్యయంతో కొత్త రైల్వే లైన్లను కేంద్రం నిర్మించనుంది. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌, ఒడిశాలో మొత్తం రూ.9,450 కోట్ల అంచనా వ్యయంతో 4 రైల్వే మల్టీట్రాకింగ్‌ ప్రాజెక్టులతో పాటు బిహార్‌లోని ఎన్‌హెచ్‌-22లోని ముజఫర్‌పూర్‌-సీతామర్హి-సోన్‌బర్సా విభాగాన్ని హైబ్రిడ్‌ యాన్యుటీ మోడ్‌(హెచ్‌ఏఎమ్‌) కింద నాలుగు లైన్ల రహదారిని రూ.3,591 కోట్లతో ఆధునీకరించడానికి ఆమోదం తెలిపింది.

కేంద్రం తాజా నిర్ణయం మేరకు గూడూరు-గుమ్మిడిపుండి మధ్య 3, 4 రైల్వే లైన్ల నిర్మాణాన్ని 90 కిలోమీటర్ల పొడవున నాలుగేళ్లలో పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వివరించారు. ఈ రైల్వే లైన్ల నిర్మాణంలో భాగంగా స్వర్ణముఖి నదిపై ఒక భారీ బ్రిడ్జి, 21 పెద్ద బ్రిడ్జిలు, 127 చిన్న బ్రిడ్జిలు, 34 ఆర్వోబీ లేదా ఆర్‌యూబీలను నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ కొత్త రైల్వే లైన్లతో పులికాట్‌ సరస్సు, నేలపట్టు పక్షుల అభయారణ్యం, వీరరాఘవ పెరుమాళ్‌ ప్రభు ఆలయానికి మరింత కనెక్టివిటీ పెరగనుంది. కొత్త రైల్వే ప్రాజెక్టులతో దాదాపు 60 లక్షల జనాభా ఉన్న దాదాపు 6,448 గ్రామాలకు మెరుగైన రైలు అనుసంధానాన్ని ఈ ప్రతిపాదిత మల్టీట్రాకింగ్‌ ప్రాజెక్టులు అందించనున్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్టులను 2030-31 నాటికి పూర్తి చేయాలని కేంద్రం లక్ష్యంగా నిర్ణయించింది.