Skip to main content

Telugu News Power

కూటమిది చెట్లు నరికే సంస్కృతి కాదు. మొక్కలు నాటే సంస్కృతి. -ఏ. పి. గ్రీన్ చైర్మన్ నాగబాబు.

మంగళగిరి,: ఆగస్టు,29( తెలుగు న్యూస్ పవర్. కామ్)హరిత ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనలో భాగంగా ప్రతి ఒక్కరూ పచ్చదనం పెంపునకు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి, వాటి సంరక్షణకు కృషి చేయాలని ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ శ్రీ కొణిదెల నాగబాబు గారు పిలుపునిచ్చారు. మంగళగిరి అరణ్యారామం నందవనంలో సాంప్రదాయ రావి–వేప మొక్కల నాటే కార్యక్రమంలో నాగబాబు గారు, సతీమణి పద్మజ శనివారం కలిసి పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నాగబాబు దంపతులు రావి–వేప మొక్కలను నాటారు.
ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ, “భూమాత మనకు పరోక్షంగా జన్మనిచ్చిన తల్లి. మనం పుట్టినప్పటి నుంచి చివరి శ్వాస వరకు అవసరమైన ఆహారం, నీరు, గాలి, నివాసం వంటి ఎన్నో వనరులను భూమాత నుంచే పొందుతున్నాం. మన తల్లిదండ్రులు మనకు పెట్టే ప్రతి ఆహారపు ముద్ద కూడా భూమాత ప్రసాదించినదే. అలాంటి భూమాతకు తిరిగి మనం ఏమి చేస్తున్నాం అని ప్రతి ఒక్కరు ఆలోచించాలి. అడవులను నరికి వేయడం, విచక్షణారహితంగా మైనింగ్ చేయడం, ప్రకృతిని కాలుష్యం చేయడం ద్వారా మనమే భూమాతను గాయపరుస్తున్నాం. భూమాతను కాపాడటం మన బాధ్యత మాత్రమే కాదు, మన కర్తవ్యమని నాగబాబు పేర్కొన్నారు.
ప్రకృతి పరిరక్షణకు, అశ్వత్థ నారాయణ వివాహం

భారతీయ సంప్రదాయంలో ప్రత్యేక ప్రాధాన్యం కలిగిన అశ్వత్థ నారాయణ వివాహం సంప్రదాయం ప్రకృతి, ఆధ్యాత్మికత, సామరస్యానికి ప్రతీక. రావి, వేప చెట్లను ఒకే గుంతలో నాటే ఈ సంప్రదాయంలో రావి చెట్టును విష్ణుమూర్తికి, వేప చెట్టును లక్ష్మీదేవికి ప్రతీకలుగా భావించడం మన సంస్కృతిలో ప్రకృతికి ఇచ్చిన విశిష్ట స్థానం. రావి, వేప చెట్లు కలిసి పెరగడం ద్వారా పచ్చని పరిసరాల ఏర్పాటుకు, స్వచ్ఛమైన వాతావరణానికి, జీవ వైవిధ్య పరిరక్షణకు ఎంతో దోహదపడుతుంది. ఈ చెట్లు దాదాపు 250 జీవరాశులకు ఆవాసంగా మారి, ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి.
ఆ ఆలోచనే మమ్మల్ని కలిపింది,
ఏదైనా మంచి పని మొదలుపెట్టే ముందు మొక్క నాటడం నా అలవాటు, ప్రకృతిని ప్రేమించడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూ , నాకూ ఒకే రకమైన ఆలోచనలు ఉన్నాయ నాగబాబు వెల్లడించారు. ముఖ్యమంత్రి ని కలిసినప్పుడు పర్యావరణంపై ఆయనకున్న నిబద్ధత స్పష్టంగా తెలిసింది, రాబోయే తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలనే ఉమ్మడి సంకల్పమే మమ్మల్ని ఇలా ఒకే వేదికపైకి తెచ్చింది. గత ప్రభుత్వంలోని వారికి చెట్లను నరకడమే తప్ప, నాటాలనే ఆలోచనే వాళ్లకు రాలేదు. ఏ కార్యక్రమం చేసినా అడ్డువచ్చిన చెట్లను నరుక్కుంటూ పోయారు. పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం కెన్యా వంటి దేశాలే అడవులకు, వన్యప్రాణులకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నాయి. మరి జ్ఞానానికి పురిటిగడ్డ అయిన మన భారతదేశం, పర్యావరణ పరిరక్షణలో ప్రపంచానికే ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
అరణ్యారామం డిజైన్లు పరిశీలించిన నాగబాబు.
రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖల పరిశోధన, శిక్షణ కార్యక్రమాల పర్యవేక్షణ కోసం రూ.24 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ‘అరణ్యారామం’ భవన డిజైన్లను నాగబాబు పరిశీలించారు. ఈ భవన నిర్మాణాన్ని 10 నెలల్లో పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామని పీసీసీఎఫ్ చీఫ్ పి.వి. చలపతిరావు, నాగబాబుకు వివరించారు. తాడేపల్లి పరిధిలోని అటవీ ప్రాంత వివరాలను తెలియజేశారు. ఈ భవన నిర్మాణ ప్రక్రియలో భాగంగా తొలగించాల్సి వచ్చిన 73 చెట్లను వృథాగా నరికేయకుండా, వేరే చోట విజయవంతంగా పునఃప్రతిష్ఠాపన చేశారు. ఈ విధంగా వేరే చోట నాటిన చెట్లను నాగబాబు స్వయంగా పరిశీలించి, ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పీసీసీఎఫ్ పి.వి.చలపతిరావు, సీసీఎఫ్ వైల్డ్ లైఫ్ ఎన్. నాగేశ్వరరావు, సీసీఎఫ్ గుంటూరు
వై. శ్రీనివాసరెడ్డి, సీసీఎఫ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏపీ గ్రీన్ బి.ఎన్.ఎన్. మూర్తి, డిఎఫ్ఓ గుంటూరు హిమశైలజ పాల్గొన్నారు.