
విశాఖపట్నం : జూన్, 17( తెలుగు న్యూస్ పవర్. కామ్ )
రుషికొండలో గత ప్రభుత్వం నిర్మించిన భవనాల వినియోగంపై కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు పయ్యావుల కేశవ్, డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి క్షేత్రస్థాయిలో బుధవారం పరిశీలించారు.
గతంలో ఏపీటీడీసీకి ఏటా రూ.7.5 కోట్ల ఆదాయం వచ్చే హరిత రిసార్ట్స్ను కూల్చివేయడం వల్ల పర్యాటక శాఖ తీవ్రంగా నష్టపోయింది. ఇప్పుడు ప్రజాధనంతో నిర్మించిన ఈ ఆస్తిని కూల్చివేయకుండా, పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ ) విధానంలో అంతర్జాతీయ స్థాయి లగ్జరీ రిసార్ట్గా అభివృద్ధి చేసి ప్రభుత్వానికి ఆదాయం తీసుకురావడంతో పాటు, ప్రజలకు అందుబాటులో ఉంచే విధంగా ప్రాథమికంగా నిర్ణయించారు.విశాఖ ప్రజల భావోద్వేగాలను గౌరవిస్తూ, రుషికొండలో ఒక భాగాన్ని హెరిటేజ్ లేదా కల్చరల్ సెంటర్గా అభివృద్ధి చేసి, సందర్శనార్థం అందుబాటులో ఉంచే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ మార్గదర్శకత్వంలో ప్రజాధనం వృథా కాకుండా, రాష్ట్ర పర్యాటకాభివృద్ధికి తోడ్పడే విధంగా సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామని క్యాబినెట్ సబ్ కమిటీ వెల్లడించింది.
