
భీమవరం :మే,13(తెలుగు న్యూస్ పవర్. కామ్) భీమవరం శ్రీమావుళ్ళమ్మ అమ్మవారి శాశ్వత నిత్యాన్నదాన నూతన భోజనంశాలను బుధవారం రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) ప్రారంభించారు. నిత్యాన్నదానానికి ఆలయ ప్రాంగణంలో స్థలం లేకపోవడంతో భక్తులు ఇబ్బంది పడేవారని, యేలుబండి ఆదియ్య కుటుంబీకులు తాత్కాలికంగా అద్దె ప్రాతిపదికన స్థలాన్ని అందించారని, ఆ స్థలంలో భక్తులకు అనువుగా భవనం ఏర్పాటు చేయడం మావుళ్ళమ్మ కృప అని అన్నారు. నిత్యాన్నదానానికి భవనం లేదని సమస్య కొంత తీరినట్లేనని, ప్రతిరోజు సుమారు 2 వేల మంది భక్తులకు నిత్య అన్నప్రసాద వితరణ జరిగేలా భవనము ఏర్పాటు అయ్యిందన్నారు. అనంతరం భక్తులకు ఎమ్మెల్యే అంజిబాబు స్వయంగా అన్న ప్రసాదాన్ని వడ్డించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో బుద్ధ మహాలక్ష్మి నగేష్, ఆలయ చైర్మన్ బోండాడ నాగ భూషణం, ఆలయ ప్రధానార్చకులు మద్దిరాల మల్లిఖార్జున శర్మ, ఆలయ పాలకవర్గ సభ్యులు రామాయణం శ్రీనివాస్, అరసవల్లి సుబ్రమణ్యం, ఇందుకూరి సుబ్రహ్మణ్య రాజు, ఉడిసి మీనాక్షి, అతికెల ఆంజనేయ ప్రసాద్, గుసిడి శిరీష, కారెంపూడి ఆదిలక్ష్మి, మిర్తిపాటి గున్నేశ్వరరావు, మల్లువలస లక్ష్మి, గొంతిన రమణ, యండ సత్యవతి, పాపోలు ఏడుకొండలు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.